పెళ్లైన నెల రోజులకే ఓ నవ వధువు సూసైడ్ చేసుకుని కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లా నెహ్రూనగర్ కు చెందిన ఝాన్సీని, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లి సమయంలోనే వరుడి కుటుంబానికి ఝూన్సీ తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ముట్టచెప్పారు.
ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఝాన్సీని రెండో రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఝాన్సీని పుట్టింట్లో వదిలేసి రూ.70 లక్షలు తెస్తేనే కాపురం అంటూ తేల్చేశారు. పెద్దమనుషులు ఎంత నచ్చచెప్పినా రాధాకృష్ణ మరియు అతడి కుటుంబం ఒప్పుకోలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఝాన్సీ పుట్టింట్లోనే ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి.. ఫ్యాన్కు ఉరి వేసుకుంది.
కొంత సమయానికి ఝాన్సీని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను హాస్పటల్కి తరలించినా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సూసూడ్ నోట్ స్వాధీనం చేసుకోగా.. అందులో `నా అత్తింటివాళ్లను వదిలిపెట్టవద్దు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు.. నా కుటుంబాన్ని రక్షించండి.. పవన్ (తమ్ముడు) నువ్వు ఏడవద్దు.. భవిష్యత్తులో నా కుటుంబానికి ఆపద వస్తే అది రాధాకృష్ణ వల్లనే` అంటూ ఝాన్సీ రాసింది. దాంతో పోలీసులు ఆమె భర్త రాధాకృష్ణను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.