ఒకే ఫ్రేమ్‌లో తారక్, మహేష్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై మరోసారి తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోను హోస్ట్ చేస్తూ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు తారక్. ఇక ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా వస్తుండటంతో ఈ షోను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలతో ఎవరు మీలో కోటీశ్వరులు షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు తారక్ కూడా రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ షోలో స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, శివ కొరటాల గెస్ట్‌లుగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. కాగా ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్‌ను రంగంలోకి దించాడు తారక్. మహేష్ బాబుతో ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను చేసి ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అయ్యారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లాంటి షోలో పాల్గొనడం తనకు కూడా సంతోషంగా ఉందంటు మహేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ను నిర్వాహకులు ముగించేశారట. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఈ షూటింగ్‌లో ఒకే వేదికపై ఎన్టీఆర్, మహేష్ బాబు కనిపించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకలు అంటున్నారు.

ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను దసరా కానుకగా టెలికాస్ట్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆల్ టైమ్ టీఆర్పీని సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి తారక్ కోసం మహేష్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎలాంటి సందడి చేశాడనేది తెలియాలంటే మాత్రం దసరా వరకు ఆగాల్సిందే.