ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ మరియు ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాశేఖర్ స్వయంగా వెళ్లి ఉత్తేజ్ని పరామర్శించారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు పద్మ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
పద్మ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఉత్తేజ్.. నటుడుగానే కాకుండా రచయితగానూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించిన ఉత్తేజ్..ఇటీవల ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ను స్థాపించారు.