నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ డేట్ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. అందుకు కారణమూ లేకపోలేదు. ఏపీలో ఈ మధ్య టిక్కెట్ రేట్లును బాగా తగ్గించేస్తూ జీవో పాస్ చేసింది. ఈ జీవో వల్ల పెద్ద సినిమాలు భారీగా ఎఫెక్ట్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయమై చర్చించనున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో మీటింగ్ జరగనుంది. అయితే ఆ మీటింగ్లో తేలే విషయాలని బట్టి అఖండను అక్టోబర్లో రిలీజ్ చేయాలా..? లేక ఆ తర్వాత రిలీజ్ చేయాలా..? అన్నది మేకర్స్ నిర్ణయిస్తారట. అంటే జగన్ మీటింగ్ తర్వాతే అఖండ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుందన్నమాట.