ఇక నుంచి ఆ స్కూళ్ల‌లో బాలిక‌ల‌కు ఎంట్రీ: మోదీ

భారత ప్రధాని నరేంద్ర‌మోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్‌లో గర్ల్స్‌కు ఎంట్రీ ఉంటుంద‌ని చెప్పారు. చాలా మంది బాలిక‌లు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలిక‌ల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ త‌లుపులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ప్ర‌ధాని మోడీ స్పష్టం చేశారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయని, రెండున్న‌రేళ్ల కింద‌ట తొలిసారి ప్ర‌యోగాత్మ‌కంగా మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలిక‌ల‌ను అనుమ‌తించిన‌ట్లు మోడీ గుర్తు చేశారు. ఇక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్ మ‌న దేశంలోని కూతుర్ల కోసం త‌లుపులు తెరుస్తాయ‌ని ప్రకటించారు. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ నియంత్ర‌ణలో ఉండే సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ సైనిక్ స్కూళ్ల‌ను నిర్వ‌హిస్తుంది. మోడీ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న బాలికలు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.