చేతులెత్తేసిన నాని.. బోరుమంటున్నారుగా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నాని, త్వరలోనే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు తక్కువ వ్యవధి సమయంలోనే రిలీజ్ కానుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా థియేటర్లు మూతపడటంతో వెండితెరపై నాని బొమ్మ చూసి చాలా రోజులైందని వారు ఫీలవుతున్నారు.

కానీ టక్ జగదీష్ చిత్రం పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో చూసేయొచ్చని వారు సంబరపడ్డారు. అయితే వారికి నాని కోలుకోలేని షాకిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లకు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ వచ్చే సూచన కనిపించడం లేదు. ఇటీవల థియేటర్లు మళ్లీ తెరుచుకున్నా కేవలం చిన్న చిత్రాలను మాత్రమే రిలీజ్ చేశారు. వాటికి కూడా ఆడియెన్స్ ఏదో నామమాత్రంగా రావడంతో పెద్ద సినిమాలను ఇలాంటి సమయంలో నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పదేపదే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే టక్ జగదీష్ చిత్ర నిర్మాత లక్ష్మణ్ ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో సినిమాలను థియేటర్లలోనే చూద్దామని మెసేజ్ ఇచ్చిన నాని సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండటంతో వివాదాస్పదంగా మారుతోంది. అయితే సినిమా రిలీజ్ అంశం పూర్తిగా నిర్మాత చేతుల్లో ఉంటుందని నాని అంటున్నాడు. ఏదేమైనా నాని సినిమాను పెద్ద బొమ్మపై చూద్దామని ఎంతగానో ఆశపడ్డ ఆడియెన్స్ ఇప్పుడు బోరుమంటున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.