న్యాచురల్ స్టార్ నాని మనసు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. కరోనా సెకెండ్ వేవ్కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా టక్ జగదీష్ను ఓటీటీకి ఇచ్చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.42 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుందని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి తరుణంలోనే విడుదలైంది చిత్రమే `SR కళ్యాణమండపం`. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి చాలా మంది నిర్మాతలు భయపడుతుంటే..యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ఆడియన్స్ వస్తారనే నమ్మకంతో థియేటర్లోకి దిగాడు.
ఇక ఈయన అనుకున్నట్టే SR కళ్యాణమండపం భారీ వసూళ్లు రాబట్టి.. సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మిగిలిన నిర్మాతలు కూడా మందుడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే నాని కూడా మనసు మార్చుకుని ఓటీటీ డీల్ను క్యాన్సిల్ చేసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే థియేటర్లో దిగేందుకు డేట్ లాక్ చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుండడంతో..ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.