టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఐసీసీ’.వారు ఎప్పటి నుంచో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ‘ఐసీసీ టీ20 ప్రపంచ కప్’ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది.

ఫైనల్ వేదికగా దుబాయ్‌ను నిర్ణయించారు నిర్వాహకులు. రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న మెగా ఈవెంట్ స్టార్ట్ కానుంది. రౌండ్‌ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధిస్తాయి.

గ్రూప్ 2లో ఉన్న ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అక్టోబర్ 24న తలపడనుంది. ఇదే క్రమంలో అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గనిస్తాన్‌తో, నవంబర్‌ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్‌ 8న ఏ1 క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది భారత్. నవంబర్‌ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్‌ 14వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ ఉండబోతున్నది.