క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు ఒకేచోట కలిస్తే అభిమానులు ఆనందంతో ఊగిపోతుంటారు. తాజాగా హైదరాబాద్లో అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన చిరకాల స్నేహితుడు, భారతదేశానికి తొలి ప్రపంచకప్ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ను కలిశారు.
ఫలక్నుమా ప్యాలెస్ లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్తో చిరంజీవి సందడి చేశారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన ఇన్స్టాలో షేర్ చేశారు. `చాలాకాలం తర్వాత నా మిత్రుడు కపిల్దేవ్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది.. పాత జ్ఞాపకాలను ఓసారి గుర్తుచేసుకున్నాం` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
దాంతో చిరు పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ ద్శకత్వంలో `ఆచార్య` చేస్తున్న చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మరియు బాబి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.