చిన్నారిపై దాడి చేసిన తాలిబాన్లు.. ఫొటోలు వైరల్!

అఫ్ఘానిస్తాన్ దేశంలో అధికారం చేపట్టిన తాలిబన్లు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాలిబన్లు దేశాన్ని వశపరచుకున్న తర్వాత అఫ్ఘాన్ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. దేశం నుంచి పారిపోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి విమానాశ్రయం ఒక్కటే మార్గం కావడంతో అక్కడికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు.

అయితే తాలిబాన్లు ఎయిర్ పోర్టుకు చేరుకొని వారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా వారి అఘాయిత్యాలకు సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టు రోడ్డు వద్దకు వచ్చిన ప్రజలపై వారు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిలో ఒక మహిళ, చిన్నారి కూడా ఉండటం అందర్నీ కలిచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శాంతిని నెలకొల్పడమే తమ ధ్యేయమని తాలిబన్లు చెప్తున్నారు కానీ వారి మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని ప్రస్తుతం జరిగే సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.