పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తుండగా.. రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఈ వార్తలను నిజం చేసింది చిత్రయూనిట్. పవన్ మూవీలో నిత్యా మీనన్ నటిస్తుందని తెలియజేస్తూ.. తాజాగా ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇక పవన్తో తొలిసారి నిత్యా మీనన్ జతకట్టబోతుండడంతో.. సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కాగా, రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.