ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అభ్యర్థులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగుతుండడంతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది.
ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా వివాదాలు, నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. అలాగే కొందరు కావాలనే తనకు, రాజశేఖర్కు మధ్య విభేదాలు సృష్టించారని.. దీని వెనక ఒక హిడెన్ ఎజెండా ఉందనిపిస్తుందని నరేష్ చెప్పుకొచ్చాడు.
తాను ఎన్ని మంచి పనులు చేసినా.. కొంత మంది శత్రువులుగా మారారని, వారే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు. తొమ్మిది వందల మంది సభ్యులను కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఎందుకు మౌనంగా ఊరుకోవాలి? మేము చేసిన మంచి పనులను తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ హిడెన్ ఎజెండా వెనక ఎవరున్నారు? మా లో చిచ్చు రేపాలనుకుంటున్న బిగ్బాస్ ఎవరు? అని నేను ప్రశ్నిస్తున్నా. మా అసోషియేషన్కు ఒక మంచి ప్రెసిడెంట్ కావాలి. దాని కోసమే నేను పోరాడుతున్నా అంటూ నరేష్ వ్యాఖ్యానించాడు.