ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న రవింద్ర హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఉంటున్నారు. అయితే గత రాత్రి ఉన్నట్టుండి రవింద్రకు రక్తపు వాంతులు కావడంతో.. వెంటనే హోటల్ సిబ్బంది ఆయనకు వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించారు. కానీ, ఈ లోపే రవీంద్ర మరణించారు.
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకున్న మాగంటి రవీంద్ర మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు. కాగా, మాగంటి బాబు పెద్ద కుమారుడు మాగంటి రాంజీ కూడా ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా బయటపడక ముందే మాగంటి కుటుంబంలో మరో విషాదం నెలకొనడం గమనార్హం.