సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా టీజర్పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ రతన్ బాబు మాట్లాడుతూ.. మోహన్బాబుగారి అసెంబ్లీ రౌడీ జూన్ 4, 1991న విడుదలైంది. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే తేదీన సన్నాఫ్ ఇండియా టీజర్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించారు.
కాగా, బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ జూన్ 4న విడుదలై సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు, మోహన్ బాబుకు కలెక్షిన్ కింగ్ అనే బిరుదును తెచ్చిపెట్టింది. అయితే 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమా విడుదల తేదీ రోజునే సన్నాఫ్ ఇండియా టీజర్ విడుదల కానుండటం విశేషం.