పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సంతోష్ కు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ నేథప్యంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం, అభిషేక్ మహర్షి అనే కొత్త దర్శకుడితో ప్రేమ్ కుమార్ అనే చిత్రం చేస్తున్న సంతోష్.. మరో ప్రాజెక్ట్కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అది కూడా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలోనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ 8 తొట్టకల్ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ చిత్రంలో హీరోగా సంతోష్ శోభన్ను సంప్రదించగా.. ఆయన వెంటనే ఓకే చెప్పాడట. తమిళ వెర్షన్ డైరక్ట్ చేసిన శ్రీ గణేష్ తెలుగులో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయాలని సుస్మిత ప్లాన్ చేస్తుందట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.