తాప్సీ `శభాష్ మిథు`కు డైరెక్ట‌ర్ ఛేంజ్‌..కార‌ణం అదేనా?

తాప్సీ పన్ను ప్రస్తుతం న‌టిస్తున్న బయోపిక్ శభాష్ మిథు. భారత మహిళా క్రికెట్ సారథి మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఇందుకోసం క్రికెట్ కూడా నేర్చుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా విష‌యంలో ఊహించ‌ని ట్విస్ట్ చోటు చేసుకుంది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ఛేంజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ముందు ప్రకటించారు. ఏడాది నుంచి స్క్రిప్టు మీద‌, అలాగే ప్రి ప్రొడ‌క్ష‌న్ మీద రాహుల్ ఫుల్‌గా వ‌ర్క్ చేశాడు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఆయ‌న త‌ప్పుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం రాహుల్‌ ప్లేస్‌లో దర్శకుడిగా శ్రీజిత్ ముఖర్జీ ఎంటరయ్యారట. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. స్క్రిప్టు విష‌య‌మై ర‌చ‌యిత‌, నిర్మాత‌తో రాహుల్‌కు విభేదాలు వ‌చ్చాయ‌ని.. అందుకే ఆయ‌న శభాష్ మిథు నుంచి త‌ప్పుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.