అభిమానుల‌కు మ‌హేశ్ డ‌బుల్ ద‌మాఖా..!

ప్రిన్స్ మ‌హేశ్‌బాబు అభిమానుల‌కు పండ‌గ‌లాంటి వార్త ఇది. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సూపర్‌స్టార్ను వెండితెర మీద చూడ లేక‌పోయిన ప్రేక్ష‌కుల‌కు ఆ గ్యాప్‌ని భర్తీ చేస్తూ ఒకేసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేయలేకపోయాడు. దీంతో దాదాపు రెండేళ్ళ గ్యాప్‌ను వ‌చ్చింది. అభిమానుల‌కు ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు మ‌హేశ్ దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రీన్స్ త‌న కెరీర్‌లో 27వ మూవీగా సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండ‌గా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించ‌నుంది. ఈ మూవీని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా, ఈ సినిమాను 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మాట‌ల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే సర్కారు వారి పాట సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ – మహేష్ సినిమాను 2022 సమ్మర్ లో విడుదల చేస్తామని తాజాగా వచ్చిన ప్రకటనలో అధికారకంగా వెల్లడించారు. ఇక ఇప్ప‌టికే మ‌హేశ్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అత‌డు, ఖ‌లేజా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు వ‌చ్చాయి. అత‌డు మూవీ రికార్డులు తిర‌గ‌రాయ‌గా, ఖ‌లేజా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా రానుండ‌డంతో ప్రిన్స్ అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది.