మ‌హేష్ ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచిన సర్కారు వారి టీమ్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే సీనియర్‌ నటుడు, మ‌హేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజ‌ర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా ఈ ప్ర‌చారంపై స్పందించిన మేక‌ర్స్‌.. మ‌హేష్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచారు.ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ఉధృతి నేపథ్యంలో మే 31న స‌ర్కారు వారి పాట చిత్రం నుంచి ఎలాంటి సర్ప్రైజింగ్ అప్‌డేట్ లేద‌ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే త‌మ సినిమా అప్‌డేట్ల‌ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దంటూ మేక‌ర్స్ కోరారు.