టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్లో హిట్ అయిన అంధధూన్ కు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత నితిన్ పవర్ పేట అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాల్సి ఉంది.
కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నితిన్ మూడు పాత్రలలో కనిపించనున్నాడని వాటిలో 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర కూడా ఒకటని టాక్. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇలాంటి తరుణంలో ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు ఊపందుకున్నాయి.
ఇందుకు బడ్జెట్నే కారణమని తెలుస్తోంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య 40 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి ఉంటుందని చెప్పాడట. కానీ, ఈ ఫిగర్ నితిన్ మార్కెట్ కి చాలా ఎక్కువని నిర్మాతలు వెనక్కి తగ్గారట. మరి ఇదే కాంబినేషన్లో సినిమా రావాలంటే దర్శకుడు ఖచ్చితంగా బడ్జెట్ తగ్గించాల్సి ఉంటుంది లేదా నిర్మాతలే బడ్జెట్ పెంచుకోవడానికి ఒప్పుకోవాలి. మరి ఈ రెండిటిలో ఏది జరుగుతుందో చూడాలి.