జీడిమెట్ల‌లో క‌ల‌కలం.. గన్ తో బెదిరించి..

హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధిలోనే కాదు నేరాల‌లోనూ అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. మ‌హా న‌గ‌రంలో గ‌న్ సంస్కృతి విస్త‌రిస్తున్న‌ది. ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకు కొంద‌రు.. సులువుగా డ‌బ్బును సంపాదించుకునేందుకు మ‌రికొంద‌రు అడ్డ‌దారులు తొక్కుతున్నారు. నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. చోరీల‌కు తెగ‌బ‌డుతున్నారు. అలాంటి సంఘ‌ట‌న తాజాగా జీడిమెట్ల‌లో వెలుగుచూసింది. బాధితుడు, అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. జీడిమెట్ల అయోధ్య నగర్లో గత ఎనిమిది సంవత్సరాలుగా రవి అనే వ్యక్తి నగదు బదిలీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్ర‌మంలో శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు నెంబర్ ప్లేట్ లేని యక్టీవా ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకరు హెల్మెట్ పట్టుకోగా మరొకరు మాస్క్ పెట్టుకొని రాత్రి దుకాణంలోకి వెళ్లి గన్ తో యజమాని రవి ని బెదిరించారు ఒకరు. వెంట‌నే అతడి ఫోన్ ను, రూ.1.95 లక్షల నగదు ను ఎత్తుకెళ్లారు దొంగలు.

ఇదిలా ఉండ‌గా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ లో నమోదయ్యాయి. రెండు టీమ్ లు గా ఏర్పడిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితులు కొంపల్లి వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడిన ముఠా కొంపల్లి వైపు వెళ్లి అక్కడ బాధితుడి ఫోన్ ను రోడ్డు పక్కన పొదల్లో పడేశారు. చోరీకి పాల్పడిన ఇద్దరు యువకుల వయస్సు సుమారు 22, 25 గా ఉండవచ్చని పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. నిండుతుల వెలిముద్రలను స్వాధీనం చేసుకోగా, దొంగలు అంతరాష్ట్ర ముఠా గా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ముఠాను ప‌ట్టుకుంటామ‌ని జీడీమెట్ల సీఐ బాలరాజు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.