ఐపీఎల్ కొత్త నిబంధన..ఈసారి అలా చేస్తే ఆటగాళ్లకు కోత త‌ప్ప‌దు!

మ‌రి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 టోర్నీ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లీగ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చెన్నై వేదికగా ఏప్రిల్ 9న నుంచి లీగ్ స్టార్ట్ కానుండ‌గా.. ఇప్పటికే కీలక ఆటగాళ్లు బయోబబుల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14 వ సీజన్‌లో బీసీసీఐ కొత్త నిబంధ‌న తీసుకువ‌చ్చింది.

ఈ సారి స్లో ఓవర్ రేటుపై బీసీసీఐ కఠినంగా వ్య‌వ‌హ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బీసీసీఐ నిబంధనల ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగ్‌ చేస్తే మెుదటిసారి కెప్టెన్‌కు రూ. 12 లక్షలు జరిమానా, రెండు సారి కూడా అలాగే చేస్తే రూ. 24 లక్షలు జ‌రిమానా విధిస్తారు. అంతేకాకుండా జట్టులోని ప్రతి ఆటగాడిపై రూ. 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్‌ ఫీజు కోత ఉంటుంది.

ఇక సీజన్‌లో మూడో సారి కూడా స్లో ఓవర్‌రేట్‌ వేస్తే కెప్టెన్‌కు రూ. 30 లక్షలు జరిమానాతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధాన్ని కూడా ఎదురుకుంటాడు. కాబ‌ట్టి, మునిపటిలా తీరిగ్గా బౌలింగ్‌ చేస్తే కుదరదు. అలాగే 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్‌ 20వ ఓవ‌ర్ పూర్తి కావాలి. లేకపోతే కెప్టెన్ భారీ మూల్యం చేల్లించకోవాల్సి ఉంటుంది.