టాలీవుడ్లో ఇటీవల హీరోల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయి. గొడవలు అంటే ఇవి రియల్ గొడవలు కాదు రీల్ గొడవలు. బాక్సాఫీస్ వేదికగా హీరోలు నటిస్తోన్న సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్నాయి. గత శుక్రవారం నాగచైతన్య, అల్లరి నరేష్ నటించిన యుద్ధం శరణం, మేడమీద అబ్బాయి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి రెండూ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
ఈ శుక్రవారం కూడా ఇద్దరు మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. సునీల్ ఉంగరాల రాంబాబు, నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా కథలో రాజకుమారి ఆ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కొన్ని నెలల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి.
టాలీవుడ్లో నెలన్నర రోజుల వరకు డేట్లు ఖాళీ లేవు. వచ్చే వారం తప్పుకుంటే జై లవకుశ, ఆ తర్వాత స్పైడర్, మహానుభావుడు, ఒక్కడు మిగిలాడు ఇలా వరుసగా సినిమాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ శుక్రవారమే హడావిడిగా ఈ సినిమాలను దించేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే శుక్రవారం 15న సునీల్ ఉంగరాల రాంబాబుతో పాటు నారా రోహిత్ కథలో రాజకుమారి సినిమాలను థియేటర్లలోకి తెస్తున్నారు.
ఉంగరాల రాంబాబును క్రాంతి మాధవ్, కథలో రాజకుమారి సినిమాను కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని రూపొందించారు. ఇక ఈ రెండు సినిమాలకు తోడుగా ఈ శుక్రవారమే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన శ్రీవల్లీ, వీడెవడు, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం కథలో రాజకుమారి వర్సెస్ ఉంగరాల రాంబాబు మధ్యే ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందో ? చూడాలి.