జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రయోగం జై లవకుశ! ఇప్పుడు ఈ మూవీ ఊహించని రేంజ్లో బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. మూవీ వచ్చి వారం అయినా.. ఫస్ట్ డే రేంజ్ కొనసాగుతూనే ఉంది. మీడియా పరంగా.. విశ్లేషకుల పరంగా కూడా ఈ మూవీపై విమర్శలు చేసింది లేదు. అయితే, ఇప్పుడు మూవీ విజయోత్సవ వేడుక సందర్భంగా జూనియర్ చేసిన భావోద్వేగ కామెంట్లపైనే అందరూ దృష్టి పెట్టారు. అంత భావోద్వేగంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశగా మారింది.
ఈ మూవీ విడుదల అయిన వెంటనే అమరావతి కేంద్రంగా టీడీపీ శ్రేణులు వాట్సప్ గ్రూపుల్లో ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయని వార్తలు వచ్చాయి. అదే పనిగా జైలవకుశపై వ్యతిరేక ప్రచారం చేస్తూనే.. మరో వైపు దీని కంటే బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ బాగుందని అంటున్నారు అనే వార్తలు వ్యాపించేలా చేశారు. ఇక, ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నాయి. చాలా సినిమాలను వీళ్ళు కావాలని దెబ్బతీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ టెంపర్ నుంచి ఈ హీరో వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ ముందుకెళుతున్నాడు.
మళ్ళీ ఎలాగైనా దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమాపై దుష్ప్రచారం మొదలుపెట్టి.. పార్టీ వ్యవహారాలను చూసే మీడియా వాళ్ళు కొంత మందిని కూడా రంగంలోకి దింపారు. ఈ పరిణామాలపైనే హీరో ఎన్టీఆర్ తో పాటు.. నందమూరి ఫ్యామిలీ కూడా తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యాడని, అందుకే అలా కఠినంగా మాట్లాడాడని కూడా వార్తలు వస్తున్నాయి.
తనను టార్గెట్ చేస్తోన్న వారిని నేరుగా విమర్శించలేక.. ఎన్టీఆర్ విశ్లేషకుల పేరును వాడి ఉంటారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక, రాబోయే రోజుల్లో మరెన్ని కామెంట్లు వినాల్సి వస్తుందోనని అంటున్నారు విశ్లేషకులు. ఇదిలావుంటే, ఎన్టీఆర్ కామెంట్లను డ్రమ్స్ శివమణి సమర్ధించడం విశేషం. దీంతో మరింత మంది ఎన్టీఆర్ కు మద్దతిచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.