నేతల పరస్పర విమర్శలతో నంద్యాల ప్రచారం హీటెక్కింది. వ్యక్తిగత విమర్శలు, దాడులతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుతున్నారు ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి వాటిని తిప్పికొడు తున్నారు. జగన్పై టీడీపీ మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీలోని అక్కాచెల్లెళ్లు ఘాటుగా స్పందిస్తూ ఏకి పాడేస్తున్నారు. మాటకు మాట బదులిస్తూ.. టీడీపీ నేతల వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొడు తున్నారు. వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు తికమకపడిపోతున్నారు. వీళ్ల కంటే.. జగన్ను టార్గెట్ చేసుకోవడమే బెటరని.. నేతలు ఫిక్స్ అయిపోయారట. తెలుగుదేశం నేతలను ముప్పుతిప్పులు పెడుతున్న ఆ అక్కాచెల్లెళ్లు.. రోజా, వాసిరెడ్డి పద్మ!!
వైఎస్ జగన్ పై విమర్శల వర్షం కురిపించడంలో మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ అగ్ర భాగాన నిలుస్తారు . రోజుకో వెరైటీ టాపిక్ తీసుకువచ్చి జగన్ వ్యాఖ్యలపైన హావభావాలపై వీరిద్దరూ తమదైన శైలిలో వాగ్బాణాలు విసురుతున్నారు. మంత్రులు దేవినేని ఉమ , ఆదినారాయణ రెడ్డి , సోమిరెడ్డి తదితర మంత్రులు నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి మౌత్ పీస్ లుగా ఉంటే వీరందరికీ రోజా చుక్కలు చూపిస్తున్నారు. వైఎస్సాఆర్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నంద్యాల ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. పంచ్ డైలాగులతో.. రైమింగ్తో కూడిన సెటైర్లతో టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.
రోజుకు పదిమంది మంత్రులు జగన్ పై దాడిచేస్తుంటే.. వాటిని ధీటుగా తిప్పి కొడుతూ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టేస్తున్నారు. రోజా వేస్తున్న వాగ్భాణాలను తిప్పి కొట్టలేని కొందరు మంత్రులు ఆమెను వదిలేసి జగన్ నే టార్గెట్ చేస్తూ పోవాల్సి వస్తోందట. ముఖ్యంగా మంత్రి అఖిలప్రియ, దేవినేని, సోమిరెడ్డిని ఆమె ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. వైసీపీ మౌత్ పీస్గా రోజా ఒక్కరే అయిపోవడంతో ఆవిడకు కొద్దిగా తోడు ఉండేందుకు వాసిరెడ్డి పద్మను రంగంలోకి దించారు. రోజా ఎటాక్ కౌంటర్ ఎటాక్ లతో భగ్గుమంటున్న సైకిల్ పార్టీ పద్మ కూడా రంగంలోకి దిగడంతో కొత్త తిట్లకు పదును పెట్టాల్సి వస్తోందట.
అగ్నికి వాయువు తోడైతే బీభత్సమే కదా! ఇప్పుడు ఇలానే ఉంది పరిస్థితి. వైసీపీ ఫైర్ బ్రాండ్స్.. టీడీపీ నేతలపై మరింత విరుచుకుపడుతున్నారు. వీరికి సరైన రీతిలో కౌంటర్లు ఇచ్చే తెలుగు మహిళలు టిడిపిలో కానరాకపోవడం మైనస్ గా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత ఆరోపణలు , విమర్శలకు రోజా అయితేనే ధీటుగా ఎదుర్కొం టారని వైసీపీ బలంగా నమ్మింది. దానిని ఆమె వందశాతం పూర్తిచేస్తున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. వైసీపీలో లేడీ ఫైర్బ్రాండ్ సిస్టర్స్గా మార్మోగుతోనన్న వీరిని టీడీపీ నేతలు ఎలా ఎదుర్కొంటారో మరి!!