దక్షిణాది వారికి రాజకీయ అవగాహన ఉండదు, వాళ్లలో రాజకీయ చైతన్యం తక్కువ అని ఉత్తరాదికి చెందిన వారంతా భావిస్తూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా `రాజకీయాలకు నడకలు నేర్పింది మేమే` అన్నంత రీతిలో తెగ ఫీలయిపోతూ ఉంటారు. దక్షిణాది వారితో పోల్చితే మాకే కొంత రాజకీయ అవగాహన అని జబ్బలు చరుచుకుంటూ బీరాలు పలికేస్తారు! అయితే దక్షిణాది వారితో పోల్చితే.. ఉత్తరాది వారికి కనీస రాజకీయ అవగాహన లేదని నిరూపించేం దుకు, వారి రాజకీయ పాండిత్యం ఎంత ఉందో అందరికీ తెలిపేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు! ఇది వింటే ఒక్కసారి ఆశ్యర్యపోవడంతో పాటు ఉత్తరాది వారి రాజకీయ పాండిత్యాన్నిప్రశంసించకుండా ఉండలేరు!!
మీకో విషయం తెలుసా.. సినీ నటుడు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు గుడ్ బై చెప్పేయబోతున్నాడట. ఏంటి షాకయ్యా రా? ఎందుకు అంటారా? అదేనండీ.. మరి కేంద్రమంత్రి అయితే సినిమాలు చేయడం కుదరదు కదా అందుకే! రాజకీ యాల జోలికే రాను అని భీష్మించుకున్న ఎన్టీఆర్కు.. కేంద్ర మంత్రి పదవా? ఎన్టీఆర్ కుటుంబానికి చెందని మరో వ్యక్తి కూడా కేంద్రమంత్రి కాబోతున్నారట. ఆమె మరెవరో కాదు ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. ఇవన్నీ ఎలా తెలుసని అనుకుంటున్నారా? మరి రాజకీయ అవగాహన అధికంగా గల ఉత్తరాదికి చెందిన ఒక సైట్ వీటిని ప్రచురించింది. వింటే జోక్ లా ఉండదు. కాదు కాదు జోక్లకే జోక్ కదా!!
కేంద్రమంత్రి వర్గ విస్తరణ గురించి ఇప్పటికి ఊహాగానాలే తప్ప స్పష్టమైన సంకేతాలేమీ లేవు. అయినా ఇప్పట్లో తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలోనూ ప్రధాని మోదీ.. ఉన్నట్లు ఎక్కడా లేదు. మరి ఈ సమయంలో.. ఏపీ గురించి ఉత్తరాదికి చెందిన డీఎన్ఏ పత్రిక.. తన వెబ్సైట్లో దీని గురించి ఒక పెద్ద ఆర్టికల్నే ప్రచురించింది. ఉత్తరాది మీడియాకు దక్షిణాది రాజకీయాలపై కనీస అవగాహన, రాజకీయాల గురించి లోటు పాట్లు ఉండవని తెలియజేసే కథనమే ఇది. మరి అసలు దక్షిణాది గురించి ఎప్పుడైనా ఆలోచిస్తేనే కదా వారికి ఇక్కడి రాజకీయాల గురించి తెలిసేది అని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఊహాగానాలు రాసినా కొద్దిగా వాస్తవికత ఉండాలి తప్ప.. సత్యదూరంగా ఉండకూడదు! ప్రస్తుతం ఎన్టీఆర్.. బిగ్బాస్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజకీయాలు నాకొద్దు మొర్రో అంటున్నాడు. ఇక పురందేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నా.. ఆమెకు కేంద్రమంత్రి పదవి ఇస్తారని ఊహించలేం. మరి ఇటువంటి సమయంలో.. ఉత్తరాది మీడియా.. తమ అజ్ఞానాన్ని ఇలా బయటపెట్టుకోవడం నిజంగా హాస్యాస్పదమే!!