తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల తర్వాత ఆమె ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. మంత్రి అవ్వాలన్న కోరిక కవితకు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరితే వచ్చే ఎన్నికల తర్వాత ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం ఉన్నా కవిత దృష్టంతా తెలంగాణ మీదే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రాథినిత్యం వహిస్తోన్న జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జగిత్యాల నియోజకవర్గం కవిత ఎంపీగా ఉన్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గపరిధిలోకే వస్తుంది. ఈ క్రమంలోనే కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖాళీ అయ్యే నిజామాబాద్ ఎంపీ సీటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్రెడ్డి దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సునీల్రెడ్డికి ఇప్పటికే ఈ సీటు విషయమై కవిత హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే సోని ట్రావెల్స్ అధినేత కొత్త ప్రభాకర్రెడ్డి మెదక్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.