అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్లీనరీలో జగన్ ప్రకటించిన కొత్త పథకాలు ఏపీ ప్రజల్లోకి వెంటనే చొచ్చుకుపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మంచి జోష్లో ఉన్నారు. ఇక ఈ ప్లీనరీలో వైసీపీ ఫైర్బ్రాండ్ లేడీ, నగరి ఎమ్మెల్యే రోజా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ప్లీనరీలో రోజాతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్సీచ్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక రోజా మామూలుగానే మీడియా ముందు మాట్లాడితే పెద్ద సంచలనం అవుతుంది. ఇక వైసీపీకి పండగలాంటి ప్లీనరిలో ఆమె పదునైన పంచ్లతో ప్రత్యర్థులపై విరుచుకు పడితే ఇక ఆ ఊపు, ఉత్సాహం మామూలుగా ఉండదు. ప్లీనరలో రోజా మైక్ అందుకున్న వెంటనే టోటల్గా సభా ప్రాంగణం అంతా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఆమె పదునైన ప్రసంగంతో ప్లీనరీకి ఊపు తెచ్చారు.
ప్రసంగం మధ్యలో పంచ్లు, సామెతలతో ప్రసంగం ఆద్యంత రక్తి కట్టించారు. ‘చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ’ అనే తీర్మానాన్ని రోజా ప్రవేశపెడతారాంటూ ఆమె పేరు చదవగానే సభ మార్మోగిపోయింది. ఇక రోజా తన ప్రసంగంలో ఏపీలో దుర్మార్గపు, దుశ్శాసన పాలన సాగుతోందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ప్రజలకు అవసరమైన మంచినీళ్ల కంటే చంద్రబాబు మద్యాన్నే బాగా పారిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.
చీఫ్ మినిస్టర్ ఛీప్ లిక్కర్కు ప్రమోటర్గా మారారని, బార్కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఆమె చేసిన కామెంట్లకు టోటల్ వైసీపీ క్యాడర్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. భల్లాల దేవుడిలాంటి చంద్రబాబును మహేంద్ర బాహుబలి జగన్ ఓడిస్తారని..జగనన్న 2019లో సీఎం అవ్వడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. ఇక ఫైనల్గా జగన్ను ఆమె అసెంబ్లీ టైగర్ – ఆంధ్రా ఫ్యూచర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడంతో సభలో హర్షధ్వానాలు మోగాయి. ఓవరాల్గా వైసీపీ ప్లీనరీకే రోజా స్పీచ్ మేజర్ హైలెట్స్లో ఒకటిగా నిలిచింది.