అవున్రాజా! డైలాగులు పేల్చడంలో దిట్ట.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాటల రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త హల్ చేస్తోంది. ఆయనకు రాజకీయాలు కొత్తకాదు. రాజకీయ డైలాగులూ కొత్తకాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆపార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి పోటీ చేశాడు. అయితే, అనూహ్యంగా అప్పటి ప్రతిపాటి పుల్లారావు గాలికి ఈయన కొట్టుకుపోయాడు. దీంతో ఆయన ఇప్పటి వరకు ఆయన ఎన్నికల్లో నిలబడలేదు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసానికి ఆఫర్ వెళ్లిందని టాక్ నడుస్తోంది. పోసాని సొంత జిల్లా గుంటూరు. పెదకాకానికి చెందిన పోసానికి రాజకీయాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రాజకీయాల్లోని కుళ్లును ఆయన ఎన్నోసార్లు వెండి తెరవేదికగా అసహ్యించుకున్నాడు కూడా. అయితే, తన లాంటి వాళ్లు వస్తే రాజకీయాలు బాగుపడతాయని ఆయన పదే పదే చెప్పేవారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఆఫర్ రావడంతో ఆయన 2019లో పోటీ చేస్తారని సమాచారం.
పోసాని ఇండస్ట్రీలో అందరికి సుపరిచితులే. బాలయ్యతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోసాని టీడీపీలో చేరేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసేందుకు ఆయన ప్లాన్లు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక, ఆయన మరోసారి తన అదృష్టాన్ని చిలకలూరి పేట నుంచే పరీక్షించుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపాటిని నరసారావు పేట ఎంపీగా పంపుతారని, ఆయన స్థానంలో పోసానికి ఛాన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి పోసాని పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమైంది.