కొద్ది రోజుల వరకు మహాభారతం ప్రాజెక్టు గురించి ఓ ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్ నడిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించడం తన జీవిత ధ్యేయమని రాజమౌళి చెపితే అదే టైంలో స్టార్ హీరోల కాంబోలో దుబాయ్కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఏకంగా రూ. 1000 కోట్లతో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడంతో ఆసక్తిరేగింది.
రాజమౌళి ఎప్పటకి అయినా ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తారనడంలో సందేహం లేదు. అయితే వీరిద్దరు ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తే ఇప్పుడు మరో మహాభారతం మన ముందుకు వచ్చేస్తోంది.
కన్నడ నటుడులు దర్శన్, రవిచంద్రన్, అంబరీష్ లాంటి నటులంతా కలిసి మహాభారతాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టుకు కురుక్షేత్ర అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందులో ద్రౌపది పాత్ర కోసం నయనతారను సంప్రదించారు మేకర్స్. దర్శకుడు నాగన్న, నయనతారకు స్టోరీ కూడా వినిపించినట్టు తెలుస్తోంది.
గతంలో నయనతార బాలయ్య – బాపు కాంబోలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించింది. ఇక ఇప్పుడు మహాభారతంలో ద్రౌపదిగా మారనుంది. ఈ సినిమా పూర్తి వివరాలు ఈ నెల 23న వెల్లడి కానున్నాయి. మరి సీతగా అదరగొట్టేసిన నయనతార ద్రౌపదిగా ఎలా మెప్పిస్తుందో చూడాలి.