ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరైన చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఇప్పుడు సెంటారఫ్ది టాపిక్గా మారారు. నిత్యం ఏదో ఒక అలిగేషన్తో మీడియాలో ఉంటున్నారు. ముఖ్యంగా విశాఖలో భూములు కబ్జా అయిపోతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని బ్యానర్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కబ్జాలకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని మహానాడు ముగిసిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.
అయితే, మంత్రి వ్యవహారశైలిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విషయం ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి.. పరిష్కారం అయ్యేలా చూడాల్సిన నేత.. కాదుకాదు.. మంత్రి.. ఈ విధంగా మీడియాకు ఎక్కడం, పెద్ద ఎత్తున ఆరోపణలు సంధించడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఏదైనా అసంతృప్తి.. చంద్రబాబుపై అక్కసు ఉన్నాయా? అని అందరూ అనుకుంటున్నారు.
తాజాగా మంత్రి గారు అధికారులు, టీచర్ల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్లు .. డమ్మీ ఉపాధ్యాయులను అక్కడి పెట్టి.. వాళ్లు మాత్రం వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. నిజానికి ఇది వాస్తవమే అయితే, మంత్రిగా ఆయన చర్యలు తీసుకోవచ్చు. ఆయన పరిధిలో లేకపోతే.. సంబంధిత మంత్రికే ఫిర్యాదు చేయొచ్చు. కానీ, అయ్యన్న వ్యవహారం చూస్తే.. మాత్రం మరో గంటా మీద కోపాన్ని.. ఇలా పరోక్షంగా మీడియా వద్ద తీర్చుకుంటున్నారని అంటున్నారు. అయితే, ఈ పరిణామం మాత్రం.. చంద్రబాబుకి కంట్లో నలుసులా పరిణమించింది! మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.