విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్గా ఎదగాలని ప్రయత్నిస్తున్న బోండా ఉమా మహేశ్వరరావు.. ఉరఫ్ బోండా ఉమా..కి పొలిటికల్గా మూడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆయనపై బాబు వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బోండా ఉమా హద్దు మీరుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంపీ నాని అండ చూసుకుని రెచ్చిపోతున్నారని కూడా తెలుస్తోంది. ఆర్టీఏ గొడవే దీనికి ప్రధాన ఉదాహరణ. ఆర్టీఏ కమిషనర్ సెక్యూరిటీని ఉమా బలంగా నెట్టడం అందరికీ తెలిసిందే.
ఇక, ఇప్పుడు తాజాగా కేన్సర్తో మరణించిన చిన్నారి సాయి శ్రీ ఆవేదన వెనుక కూడా బోండా ఉమా హస్తం ఉందని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. తమ ఇల్లు బోండా ఉమా ఆక్రమించి, వైద్యానికి అమ్ముకుందామన్నా సహకరించలేదని పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతోపాటు ఫిర్యాదులు కూడా చేసింది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచరణ చేస్తున్నారు. అదేసమయంలో మంత్రి వర్గ విస్తరణ సమయంలో తనకు పదవి దక్కకపోవడంపైనా ఇంటర్నల్గా బోండా ఉమా నేరుగా బాబుపైనే ఫైరయ్యారు.
తాను మీడియా చర్చల్లో పాల్గొనని తెగేసి చెప్పారు. అయితే, దీనిపై బాబుతో చర్చల అనంతరం మాత్రం కూలయ్యారు. కానీ, ఇప్పుడు చిన్నారి మృతి ఉదంతం మాత్ర ఉమాను వదిలి పెట్టేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు చర్యలకు సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి సొమ్ము నేపథ్యంలో వేటేసిన చంద్రబాబు ఉమాపై కూడా చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో హెచ్ ఆర్ సీ స్పందన చూశాక సీరియస్గా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
అయితే, టీడీపీలో తనకు ఏవిధమైన లోటు వచ్చినా తక్షణమే పార్టీని విడిచి పెట్టేందుకు బోండా ఉమా కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. వెను వెంటనే ఆయన పవన్ పార్టీ జనసేనలోకి జంప్ కావాలని కూడా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంలో బాబు కొంత మధన పడుతున్నట్టు సమాచారం. ఏదేమైనా త్వరలోనే బోండా ఉమాపై ఏదో ఒక చర్య తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.