ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలో మహాభారతం పెద్ద సెన్షేషనల్ ప్రాజెక్టు అయిపోయింది. బాహుబలి సినిమాతో ఇండియా వైజ్గా క్రేజ్ తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన చిరకాల కోరిక మహాభారతం తెరకెక్కిస్తానని చెపుతున్నారు. ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కించడమే తన లక్ష్యమని రాజమౌళి ఇప్పటికే పలుసార్లు ప్రకటించాడు కూడా.
రాజమౌళి మహాభారతంలో తాను కృష్ణుడు పాత్ర పోషించాలనుకుంటున్నట్టు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మరో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాను సైతం మహాభారతాన్ని తెరకెక్కించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇదిలా ఉండగానే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించనున్న రూ. 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది.
ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ బిజినెస్మేన్ డాక్టర్ బిఆర్.శెట్టి ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నాడు. మహాభారతంలోని కీలక పాత్రల్లో ఒకటి అయిన భీముడి పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇక ఈ ప్రాజెక్టులో కాస్టింగ్ ఎంపిక జరుగుతోంది. చిత్ర దర్శకనిర్మాతలు ప్రపంచస్థాయి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు పేరును ఈ సినిమాలో కృష్ణుడు పాత్ర కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు హృతిక్రోషన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించనున్న దర్శకుడు శ్రీకుమార్ మీనన్ మాట్లాడుతూ ఈ సినిమాను 2020 కల్లా పూర్తి చేస్తామని అన్నారు.