తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఎవరికి వారు పార్టీ పెట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్కె.నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణలో పలు పార్టీలు మారిన టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ విజయశాంతి ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
ఇంతకు విజయశాంతి అక్కడ ఎవరి తరపున ప్రచారం చేస్తున్నాడో తెలుసా అమ్మ నెచ్చెలి శశికళ మేనల్లుడు టీవీ దినకరన్ను గెలిపించాలని, టోపీ గుర్తుకే ఓట్లు వేయాలని ఆమె అక్కడ ప్రచారం దంచికొడుతున్నారు. విజయశాంతి తమిళ్లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇంత వరకు బాగానే ఉంది..ఇంతకు విజయశాంతి ఏ పార్టీ అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ మాత్రం లేదు.
గతంలో తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా విజయశాంతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ వరకు చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్నారు.
ఇక ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే తరపున ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో విజయశాంతి తెలంగాణలో కాంగ్రెస్ – తమిళనాడులో అన్నాడీఎంకే అన్న జోకులు పేలుతున్నాయి. ఇక దినకరన్కు రెండు రోజుల క్రితం తమిళ స్టార్ హీరో శరత్కుమార్ మద్దతు ప్రకటించగా, ఇప్పుడు విజయశాంతి మద్దతు ప్రకటించింది. ఇలా అన్ని రకాలుగా ఆర్కె.నగర్లో గెలుపుకోసం ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.