లోకేశ్‌పై ఊస్టింగ్ మినిస్ట‌ర్ సెటైర్లు

టీడీపీలో మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఏ రేంజ్‌లో సెగ‌లు రేపుతుందో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని సీనియ‌ర్లు ఓ రేంజ్లో విరుచుకుప‌డుతున్నారు. ఇక ఉద్వాస‌న‌కు గురైన మంత్రులు సైతం ర‌గిలిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని అనారోగ్యం పేరుతో మంత్రివర్గం నుంచి తొలగించినా ఆయన మాత్రం ‘పంచ్ లు’ వేస్తున్నారు.

బొజ్జ‌ల‌కు చంద్ర‌బాబు ఎంత న‌చ్చ‌చెప్పినా ఆయ‌న‌, ఆయ‌న త‌న‌యుడు సుధీర్‌రెడ్డి మాత్రం అసంతృప్తిని బాహ‌టంగానే వ్య‌క్తం చేస్తున్నారు. బొజ్జ‌ల అయితే ఏకంగా చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌ను టార్గెట్‌గా చేసుకుని పంచ్‌లు వేస్తుండ‌డం విశేషం. వారసులు ప్రజల నుంచి రావాలి కానీ…ఇది రాజరికం కాదుగా..తండ్రి అధికారం పోగానే…కొడుకుకు కిరీటం పెట్టడానికి అని వ్యాఖ్యానించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్య‌లు చూస్తే నారా లోకేష్‌కే త‌గిలిన‌ట్టు ఉన్నాయ‌న్న గుస‌గుస‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఓ ఛానెల్ విలేక‌రి మిమ్మ‌ల‌ను మంత్రి పదవి నుంచి తప్పించారు..మీది రాజకీయం కుటుంబం కాదని..మీ కుమారుడి భవిష్యత్ ఏమిటని ప్రశ్నించగా..ఎవరైనా సరే ప్రజల నుంచే రావాల్సి ఉందన్నారు.

ఇక తాను టీడీపీ కోస‌మే ప‌ని చేయాల‌నుకుంటే చంద్ర‌బాబు మాత్రం…త‌న ఆరోగ్యం గురించే ప‌దే ప‌దే మాట్లాడార‌ని వ్య‌గ్యంగా చంద్ర‌బాబుపై కూడా కౌంట‌ర్ వేశారు. లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన విషయంలో విపక్షాల నుంచి విమర్శలు వస్తాయనుకుంటే..స్వపక్షం నుంచే దాడి ప్రారంభం కావటం విశేషం.