జనసేన అధినేత పవన్ ఓ వైపు వరుసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు రెడీ అంటు ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్గా మారింది.
ఇంత తక్కువ టైంలో పవన్ ఎన్నికలకు తన టీంను ఎలా సెట్ చేసుకుంటాడు ? ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాడన్న డౌట్లు అందరికి ఉన్నాయి. ఈ షార్ట్ పీరియడ్లో పవన్ తనకంటూ ఓ స్పెషల్ టీంను రెడీ చేసుకుని ఆ టీంతోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మెరికల్లాంటి కుర్రాళ్ల కోసం జనసేన ఇప్పటికే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. యువతతో పాటు సీనియర్లకు కూడా పవన్ ప్రయారిటీ ఇవ్వనున్నాడు. పవన్కు అత్యంత సన్నిహితుడైన ఆలీ కూడా జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆలీకి గుంటూరు తూర్పు లేదా రాజమండ్రి అర్బన్ టిక్కెట్టును కేటాయిస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.
ఇక ముస్లిం ఓటర్లు ఎక్కువుగా ఉన్న నియోజకవర్గాల్లో ఆలీకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇక పవన్ ముస్లిం ఓట్లపై స్పెషల్ కేర్ తీసుకుంటే ఆ వర్గాల్లో మంచి పట్టున్న వైసీపీకి ఇబ్బందులు తప్పవు. ఏపీలో ముస్లింలు కాంగ్రెస్కు సుదీర్ఘకాలంగా ఓటు బ్యాంకుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత వారంతా వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు జనసేన కూడా ముస్లిం ఓట్లపై కాన్సంట్రేషన్ చేస్తే వైసీపీకి ముస్లింల ఓటు బ్యాంకు గండితప్పదు.