సెలబ్రిటీలను అంబాసిడర్లుగా నియమిస్తే.. ఆ సంస్థకు సంబంధించిన ఏకార్యక్రమంలోనైనా పాల్గొంటారు. మరి అలాంటిది ఏకంగా ఒక రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడర్ అంటే.. ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఆ బాధ్యత మరిచింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా!! హైదరాబాద్కు చెందిన క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించిన ఆమెను.. రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడర్ చేసి కోట్లు కుమ్మరించారు ముఖ్యమంత్రి కేసీఆర్! అయితే అడపాదడపా ఫ్యాషన్ షోల్లో తళుక్కుమని మెరవడం మినహా ఆమె వల్ల ఒనగూరిన ప్రయోజనం మరొకటి లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ.. ఆమె బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంలో సమంత ఆదర్శంగా నిలుస్తోంది!!
తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో సానియా పూర్తిగా విఫలమవగా.. హీరోయిన్ సమంత.. సానియాకు ఆదర్శంగా నిలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ అంటే కేవలం హోదా మాత్రమే కాదని .. బాధ్యత అని గుర్తుచేస్తోంది సమంత!! ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమితం అయిన సమంత..ఆ హోదాలో తెలంగాణలో పర్యటించారు. సిద్దిపేట ప్రాంతంలో చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లారు సమంత. అక్కడ చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించారామె.
అలాగే చేనేత సమాఖ్య ను కూడా సందర్శించారు. చేనేత పనులు ఎలా జరుగుతాయో.. వారి పరిస్థితులు ఎలా ఉంటాయో దగ్గర నుంచి పరిశీలించింది. ఇంత జరిగినా.. ఈ పర్యటన అంతా గోప్యంగానే ఉంచింది సమంత! ఈ విషయాలను వారం తర్వాత కేటీఆర్ ప్రకటించారు. మరి కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా నియమితం కావడమే కాదు.. చేనేత పట్ల బాధ్యుతాయుతంగా వ్యవహరిస్తున్నానని సమంత నిరూపించుకుంది. సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన తెలంగాణ సర్కారు.. ఆమెకు డబ్బు కూడా ఏమీ ఇవ్వలేదు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియాకు.. ప్రభుత్వం కోట్లు ప్రకటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో సినీ తారలనుంచి సామాన్యల వరకూ అందరూ తమ వంతు ప్రచారం నిర్వహించారు. కానీ ఎక్కడా సానియా మాత్రం కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ తన మద్దతు ప్రకటించలేదు. మరి ఇప్పటికైనా సానియా తన బాధ్యత గుర్తిస్తుందో లేదో వేచిచూడాల్సిందే!!