డైల‌మాలో టీడీపీ సీనియ‌ర్‌:  కొడుకు ఫ్యూచ‌రా..? ఎమ్మెల్సీనా..?

వ్యూహాలు ర‌చించ‌డంలో త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు మ‌రోసారి రుజువు చేస్తున్నారు.

కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన నేత‌ల‌తో కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్య‌మిస్తూ.. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని మ‌రో వ‌ర్గం అసంతృప్తితో ర‌గిలిపోతోంది. ఈ నేప‌థ్యంలో అసంతృప్తుల‌ను చ‌ల్లార్చేందుకు బాబు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా సీటు కేటాయిస్తామ‌ని చెబుతూ.. వారిని బుజ్జ‌గిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం పైనా ఇదే అస్త్రాన్ని సంధించారు. అంత‌లోనే మ‌రో మెలిక పెట్టి బ‌ల‌రాంను ఇబ్బందుల్లో ప‌డేశారు.

క‌ర్నూలులో భూమా నాగిరెడ్డి చేరిక‌తో అసంతృప్తితో ఉన్న శిల్పా సోద‌రులు వైసీపీలో చేరుతున్న‌ట్లు గుర్తించిన చంద్ర‌బాబు.. స‌రికొత్త వ్యూహానికి తెర తీశారు. శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి ఎమ్మెల్సీ కొన‌సాగించ‌బోతున్న‌ట్టు సిగ్న‌ల్ ఇచ్చారు. త‌ద్వారా శిల్పా బ్ర‌ద‌ర్స్ ని మ‌రికొన్నాళ్లు కాపాడుకోవ‌డానికి ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నారు. ఇదే సూత్రాన్ని ప్ర‌కాశం జిల్లాకు కూడా వ‌ర్తింప‌జేస్తున్నారు. సీనియ‌ర్ నేత‌ క‌ర‌ణం బ‌ల‌రాంను కాపాడుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఎమ్మెల్సీ సీటు ఎర‌వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఖాళీ అయిన గ‌వ‌ర్న‌ర్, ఎమ్మెల్యేల కోటాల‌లో ఏదో ఒక‌టి క‌ర‌ణం బ‌ల‌రాంకి కేటాయించ‌డానికి చంద్ర‌బాబు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి గొట్టిపాటి ర‌వికుమార్ ని పార్టీలో చేర్చుకున్నప్ప‌టి నుంచి క‌ర‌ణం బ‌ల‌రాం కాక‌మీదున్నారు. ఇక చంద్ర‌బాబుకి ఝ‌ల‌క్ త‌ప్ప‌దనే వాద‌న వినిపిస్తోంది. త్వ‌ర‌గా త‌న దారి తాను చూసుకోవాల‌ని క‌ర‌ణం కుటుంబం ఆలోచిస్తోందట‌. ఈ త‌రుణంలో చంద్ర‌బాబు తాజాగా ఎమ్మెల్సీ సీటు ఎర‌వేసి బ‌ల‌రామ్‌ని చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌ర‌ణం బ‌ల‌రాంకి ఎమ్మెల్సీ సీటు కేటాయించినందున అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ ప‌ద‌వి నుంచి క‌ర‌ణం వెంక‌టేష్ త‌ప్పుకోవాల‌ని ష‌ర‌తు పెడుతున్నారు. దీంతో క‌ర‌ణం ఫ్యామిలీ ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌.

అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జి ప‌ద‌విని వ‌దులుకోవ‌డం అంటే ఆ సీటు మీద ఆశ‌లు వ‌దులుకోవ‌డ‌మే. దీని ద్వారా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గాన్ని గొట్టిపాటి చేతుల్లో పెట్ట‌డానికి క‌ర‌ణం సై అంటారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర‌ణం కుటుంబం ఖాళీగా ఉండాల్సిందే. ఎమ్మెల్సీతో స‌రిపెట్టుకోవాల్సిందే అన్న‌ది చంద్ర‌బాబు. దీంతో అటు గొట్టిపాటికి ఎమ్మెల్యే, ఇటు క‌ర‌ణం ఫ్యామిలీకి ఎమ్మెల్సీ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని దీంతో ఇరు వ‌ర్గాలు కాంప్ర‌మైజ్ అవుతాయ‌నేది బాబు వ్యూహం! ఇప్పుడు క‌ర‌ణం ముందు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి కొడుకు ఫ్యూచ‌ర్‌…రెండు ఎమ్మెల్సీ… మ‌రి ఈ కండీష‌న్ ను క‌ర‌ణం ఫ్యామిలీ అంగీక‌రిస్తుందా లేదా అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం.