రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్ది టాక్గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్భవన్లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే కేసీఆర్.. విభజన తర్వాత తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారట. దీనిలో ప్రధాని ఏపీ సహకారం లేకపోవడం వల్ల హైకోర్టు విభజన నిలిచిపోయిందని, హైకోర్టు విభజనకు ఏపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారట. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకున్న గవర్నర్.. అవును కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటి నుంచో హైకోర్టు విభజన కోరుతోందని సహకరించాలని చంద్రబాబుకు ఉచిత సలహా ఇచ్చారని సమాచారం.
అయితే, దీనిపై ఆచితూచి స్పందించిన చంద్రబాబు.. ఒక్క హైకోర్టు ఏం ఖర్మ.. అన్ని విభజన సమస్యలను ఒక్కసారే తీర్చేసుకుందాం.. ఓ డేట్ ఫిక్స్ చేయండి అన్నారట తెలివిగా! దీంతో కేసీఆర్ చిన్నబోయినట్టు తెలిసింది. ఎందుకంటే.. విభజన వల్ల ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అనుసరిస్తున వైఖరి అంతా ఇంతా కాదు. దీనికితోడు.. సచివాలయం అప్పజెప్పాక నిధులు ఇస్తారా? లేదా? అన్నిదీ తేల్చాల్సి ఉంది. అదేవిధంగా కొన్ని ఆస్తుల విషయంలో ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీంతో ఆయా సమస్యల పరిష్కారం చూడాలని చంద్రబాబు అన్నారు.
నిజానికి ఇరు రాష్ట్రాల సమస్యలను సుప్రీం కోర్టు ఇప్పటి కే ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్ నరసింహన్ పరిష్కరించాల్సి ఉంది. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన విషయంలో తెలంగాణ సర్కారు సహకరించడంలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం, మరికొన్ని సమస్యలు న్యాయంగా పరిష్కారమైతే భవనాలు అప్పగిస్తామన్నారు. అప్పుడు గవర్నర్ ఏం చేయాలి?
ఈ విషయం కేసీఆర్కు చెప్పి సంస్థల విభజన పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలి. కాని నరసింహన్ ఆ పని చేస్తున్నట్లు లేదు. కానీ, వాటిపై దృష్టి పెట్టకుండా.. ఇప్పుడు కేసీఆర్ ఏదో అడిగారని .. ఆ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలనడం ఎంత వరకు సబబని ఏపీ ప్రజలు అంటున్నారు. నిజానికి విభజన సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ఉంటే.. మొదట ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి.. హైకోర్టు విభజన చేసుకోవచ్చని అంటున్నారు.