జేసీ బ్ర‌ద‌ర్స్‌కు మ‌రో బ్ర‌దర్స్ స‌వాల్‌

అనంత‌పురం పేరు చెప్ప‌గానే ముందుగా వినిపించే పేర్లు జేసీ బ్ర‌ద‌ర్స్‌! ఒకరు ఎంపీగా, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా జిల్లా అంత‌టినీ త‌మ గుప్పెట్లో పెట్టుకుని తిరుగులేకుండా ఏలుతున్నారు. అధికార పార్టీ అండ‌తో త‌మ ఆధిప‌త్యానికి ఎదురులేకుండా చూసుకుంటున్నారు. మ‌రి అటువంటి వారిని సొంత జిల్లాలోనే ఢీకొట్టాలంటే ఎంత సాహ‌సం చేయాలి!! అలాంటి వారిని ఢీకొట్టి సంచ‌ల‌నం సృష్టించారు జ‌గదీశ్వ‌ర్ రెడ్డి సోద‌రులు! జేసీ సోద‌రుల‌తో సై అంటే సై అంటున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి!

అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీకి చెందిన మరో వర్గమైన జగదీశ్వర్ రెడ్డి సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రవీంద్రరెడ్డి అవినీతిపై జగదీశ్వర్ రెడ్డి అనుచరులు తాడిపత్రి పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు. దీంతో, జేసీ వర్గం భగ్గుమంది.

ఇరువర్గాలు కూడా బహిరంగ చర్చకు సై అంటే సై అంటున్నాయి. దీంతో తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అంతేకాదు, ముందస్తుగా రవీంద్రరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా తాడిప‌త్రిలో జేసీ బ్ర‌ద‌ర్స్‌ను స‌వాల్ చేసే స్థాయిలో జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి సోద‌రులు ఉండ‌డం అనంత పాలిటిక్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.