2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అధికార పక్షం అపరేషన్ ఆకర్ష్ కు మరోసారి తెరతీసింది. దీంతో ఇతర ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే జగన్ ఆశలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీళ్లు చల్లేందుకు సిద్ధమవుతోంది. ఆయన ఆక్రమాస్తుల కేసులను వేగవంతం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఈడీ పిలుపందుకున్నారు. దీంతో జగన్కు షాక్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీలోని మిత్రుల వల్ల తన కేసును వాయిదా వేసుకుంటూ వస్తున్నారు జగన్! అయితే జగన్ కేసుల వ్యవహారంలో కేంద్రం మెతక వైఖరి అవలంబిస్తోందని మిత్రపక్షం టీడీపీ గుర్రుగా ఉంది. దీనిపై చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘జగన్’ కేసులపై ఉదారంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆయన తమకు సవాల్ విసురుతాడని కేంద్ర పెద్దలకు చెప్పారట. అయితే గత ఆరు నెలల నుంచి బీజేపీ నేతల్లో.. ‘జగన్’ కేసుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిలో అనూహ్యమైన మార్పు వచ్చింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై ‘జగన్’ చేస్తున్న విమర్శలు…తాజాగా నోట్లరద్దుపై ఆయన వ్యవహరించిన తీరు, ఏపీకి ప్యాకేజీపై విమర్శలు తదితర విషయాలను బిజెపి నేతలను ఆలోచింప చేసిందట. దీంతో ఇప్పుడు ఆయనపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించారట. అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు మౌనం వహిస్తే చెడ్డపేరు వస్తుందనే భావనతో ఇప్పుడు (ఈడీ)ని రంగంలోకి దించినట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నెల 20వ తేదీన కానీ…లేక 23వ తేదీన కానీ (ఈడీ) అధికారులు ప్రశ్నించబోతున్నారు. దీంతో ఇక రానున్న రోజుల్లో జగన్కు చుక్కలు తప్పవంటున్నారు.