మరో 24 గంటల్లో మెగా పవర్స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా థియేటర్లలోకి వస్తోంది. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ వంటి పరాజయాల తరువాత తప్పనిసరిగా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్న చెర్రీ ఈ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్కు రీమేక్గా వస్తోన్న ఈ సినిమా రిలీజ్కు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న టైంలో సినిమా టిక్కెట్ల బుకింగ్ విషయంలో వస్తోన్న వార్తలు చెర్రీతో పాటు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మెగా ఫ్యాన్స్ ఆశలను సైతం ఈ వార్తలు నీరు గారుస్తున్నాయి. ఈ సినిమాతో చెర్రీకి హిట్ తప్పని సరి కావడంతో నిర్మాత అల్లు అరవింద్ ఏ సినిమాను పోటీ లేకుండా చేశాడు. తమిళ, కన్నడంలో సైతం ధృవకు పోటీ లేకుండా అక్కడి సినిమాలు సైతం వాయిదా వేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యాడు. ఇక మెగా ఫ్యామిలీ అంతా ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.
అసలు మ్యాటర్ ఏంటంటే ధృవకు వీరంతా ఇంత పబ్లిసిటీ చేస్తుంటే ఈ సినిమా ఆన్లైన్ టిక్కెట్ల విషయంలో మాత్రం బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తోంది. స్టార్ హీరోల సినిమాల టికెట్ల ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైన గంటల్లోనే టికెట్లన్నీ అమ్ముడవుతాయి. ఫస్ట్ వీకెండ్ టిక్కెట్లు అన్ని ఆన్లైన్లో దొరకడం కష్టమే. కానీ ధృవ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి రివర్స్లో ఉందట.
మల్టీఫ్లెక్స్తో పాటు ఏ సెంటర్లలో ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమై.. రెండు రోజులు అవుతున్నా ఇంకా సగం కూడా టిక్కెట్లు బుక్ అవ్వలేదట. ఈ సెంటర్లలోనే ఇలా ఉంటే ఇక బీ, సీ సెంటర్లలో కూడా అనుకున్న స్థాయిలో బజ్ లేదని తెలుస్తోంది. మరి రిలీజ్ డే నాటికి అయినా ధృవ పుంజుకుంటుందేమో చూడాలి.