పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వరుసగా జంప్ చేస్తున్నా వారిని ఆపే ప్రయత్నాలు చేయకుండా విపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం దేవుడు కరుణిస్తే మరో ఆరు నెలల్లోనో, యేడాదిలోనో సీఎం అవుతానని మాత్రం చెపుతూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే తాము సొంతంగా ఎదగడం మానేసి, అధికార టీడీపీ మీద వ్యతిరేకత పెరగకపోదా…అదే మాకు కలిసొస్తుందన్న స్థితికి దిగజారిపోయింది.
ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార పార్టీ సైకిల్ చెంతకు చేరిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లాలో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైసీపీకి టాటా చెప్పి సైకిలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె టీడీపీ ఎంట్రీకి చంద్రబాబు ఓకే చెప్పగా, ఆమె ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును సైతం కలిశారు.
ఈ షాక్లో ఉన్న జగన్కు ఇప్పుడు మరో చావు దెబ్బ తగలనుంది. అదే జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారట. వారిలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు ఒకరు కాగా మరొకరు తిరువూరు ఎమ్మెల్యే కొక్కలిగడ్డ రక్షణనిధి. వీరిలో మేకా ప్రతాప్ అప్పారావు పార్టీ మారతారంటూ చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఆయన గతంలో టీడీపీలో జిల్లా కమిటీలో కూడా పనిచేశారు. చంద్రబాబుతో ఆయనకు ఎంతో పరిచయం ఉంది.
ఈ క్రమంలోనే ప్రతాప్ టీడీపీ ఎంట్రీకి టీడీపీ శ్రేణులు కూడా సుముఖంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రతాప్కు తోడు రక్షణనిధి కూడా తోడవుతున్నారని టాక్. వీరిద్దరు కూడా జగన్కు హ్యాండ్ ఇస్తే జిల్లాలో వైకాపాకు చావు దెబ్బ తగిలినట్టే. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. ఇప్పటికే జలీల్ఖాన్ టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇప్పుడు కల్పన, నేడో రేపో ప్రతాప్ అప్పారావు – రక్షణనిధి కూడా పార్టీ మారిపోతే ఇక ఆ పార్టీకి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రమే ఉంటారు. జగన్ నానిని నమ్ముకుని కృష్ణా టీడీపీని ఈదుకొస్తారా ? లేదా నాని కూడా టీడీపీలోకి జంప్ చేసేస్తారా (ఆయన పేరు కూడా జంపింగ్ లిస్ట్లో ఉంది) అన్నది చూడాలి.