తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి, మేధావిగా పేరుపడ్డ కుందూరు జానారెడ్డి గురించే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్లోకి ఎందరో జంప్ చేశారు. అయినా కూడా వారిపై ఎలాంటి చర్చ ఇంతస్థాయిలో జరగలేదు. అయితే, జానా గురించే ఎందుకు చర్చిస్తున్నారంటే.. వాస్తవానికి కాంగ్రెస్లో జానా వంటి సీనియర్ నేతలు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. ఈ క్రమంలో జానాను అందరూ కాంగ్రెస్లో పెద్ద దిక్కుగా భావించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన వైఖరి తీవ్ర వివాదం, ఉత్కంఠ భరితంగా ఉంటోంది.
తెలంగాణలో విపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్.. అధికార పక్షాన్ని ఏకేయడం సహజం. ఆ పార్టీలోని అందరూ ఇదే పనిచేస్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ, జానా విషయానికి వచ్చేసరికి స్టోరీ రివర్స్ అయింది. ప్రభుత్వం,జీహెచ్ ఎంసీ పరిధిలో నడుస్తున్న రూ.5 భోజనాన్ని మెచ్చుకోవడంతో మొదలైన ప్రభుత్వ భజన మల్లన్న సాగర్ సహా డబుల్ బెడ్ రూం ప్లాట్ల వరకు సాగింది. ఇలా అన్ని సందర్భాల్లోనూ కేసీఆర్ని, ఆయన పార్టీ టీఆర్ ఎస్ను జానా పొగడకుండా ఉండలేక పోయారు. దీంతో ఆయనకు కారెక్కే టైం వచ్చేసిందని అందరూ అనుకున్నారు.
మిగిలిన హేమా హేమీ నేతల్లా జానా కూడా సర్దేసుకుంటారని టాక్ నడిచింది. అయితే, దీనిపై జానా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగని వీటిని ఆయన ఖండించలేదు. దీంతో జానా.. కేసీఆర్ పంచకు వెళ్లడం ఖాయమనే విషయం అర్ధమైపోయింది. ఇక, తాజాగా శుక్రవారం నుంచి టీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వీటిలో పెద్ద నోట్ల రద్దు అంశం, తర్వాత పరిణామాలు, మరణాలు, ప్రజల ఇబ్బందులపై ఇటు రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్, అటు కేంద్రంలోని ఎన్డీఏలను ఉతికి ఆరేసే అవకాశం కాంగ్రెస్కి చిక్కింది.
ఈ నేపథ్యంలో సభలో అందరికన్నా తాను ముందు మాట్లాడతానని చెప్పిన జానా.. మరి ఇన్నాళ్లూ బయట పొగుడుతూ వచ్చిన టీఆర్ ఎస్ను ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తాడా? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇక, అసెంబ్లీలో మాట్లాడే దానిని బట్టి, టార్గెట్ చేసే దానిని బట్టి అప్పుడు జానా ఎటువైపో తేలిపోతుందని పొలిటికల్ పండితులు అంటున్నారు. అంటే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే.. జానా భవిష్యత్తు తేలిపోతుందని అంటున్నారు.