అనంతపురం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్సీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. జిల్లాకు చెందిన ఆమె చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఉంటూ వెండితెరపై కనిపించిన వ్యక్తిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. శింగనమల నియోజకవర్గానికి చెందిన శమంతకమణి అదే జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం శాతకర్ణిలో ఓ పాత్రలో వెండితెరపై తళుక్కున మెరవనున్నారు.
ఈ సినిమాలో బాలయ్య-శ్రియా భార్యభర్తలుగా నటిస్తున్నారు. బాలయ్య టైటిల్ రోల్ గౌతమీపుత్ర శాతకర్ణి రోల్ పోషిస్తుంటే ఎమ్మెల్సీ శమంతకమణి ఓ మార్కెట్లో వ్యాపారురాలి రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఓ సీన్లో బాలయ్య – శ్రియా మార్కెట్కు వెళుతుండగా బాలయ్య జేబులో నుంచి ఓ నాణెం కింద పడిపోతుందట.
అప్పుడు శ్రియా ఆ నాణేన్ని తన కాలితో తొక్కుతుండగా శమంతకమణి తన చేయి పెట్టి అడ్డుకుంటారట. వెంటనే ఆమె శ్రియతో కాలు తీయ్… మా దేవుడినే తొక్కుతావా అని కాస్త కోపంగా చూస్తారట. ఈ సీన్లో రెండు నిమిషాల పాటు ఆమె వెండితెర మీద మెరుస్తారని తెలుస్తోంది.
ఇక శాతకర్ణిలో శమంతకమణి రోల్ చేసిన విషయమై ఆమెను మీడియా వాళ్లు ప్రశ్నించగా… సినిమా చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుందని చెప్పి సరిపెట్టేశారు. తిరుపతిలో ఈ రోజు శాతకర్ణి ఆడియో రిలీజ్ అవుతుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.