రాజకీయాల్లో.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని కూనిరాగాలు తీస్తున్నారట బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు! ఇప్పుడు ఈయనకు అంత అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. సోము పెంచి పోషించిన నేత, ఆయనకు అనుచరుడిగా చెప్పుకొని డెవలప్ అయిన నేత మాణిక్యాలరావు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాలరావు దేవాదాయ మంత్రిగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన నడిచొచ్చిన దారినే మరిచిపోయారని అంటున్నారు సోము వీర్రాజు!
మంత్రి మాణిక్యాలరావు ప్రస్తుతం తన శిబిరాన్ని గుండుగుత్తుగా మార్చేశారట. సోము వీర్రాజును మాటమాత్రమైనా తలుచుకోవడం లేదట. దీనంతటికీ కారణంగా మంత్రిగారు ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య కోటరీలోకి చేరిపోవడమేననే టాక్ వస్తోంది. ఇప్పటికే వెంకయ్య శిబిరంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ హరిబాబు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మంత్రి కూడా వారి సరసనే చేరిపోయారట. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న హరిబాబుకు ఆ పదవి టైం అయిపోయి ఏడాది అయింది. అయినా కూడా రాష్ట్ర బీజేపీ సారధిని ఇంతవరకు నియమించలేదు.
దీనికి ప్రధానంగా ఈ శిబిరాల గొడవలే కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి సోము వీర్రాజును అధ్యక్షుడిని చేయాలని గతంలో ఓ ప్రపోజల్ వచ్చింది. అయితే, దీనికి వెంకయ్యే అడ్డు తగిలారని కూడా పెద్ద టాక్. దీనికీ రీజన్ ఉంది. టీడీపీ-బీజేపీ చెలిమి నేపథ్యంలో వెంకయ్య.. ఏపీసీఎం చంద్రబాబుపై ఈగైనా వాలనివ్వడంలేదు. కానీ, సోము మాత్రం తమను టీడీపీ అధినేత తొక్కేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇది వెంకయ్యకు మింగుడు పడలేదు. దీంతోనే సోముకు రావాల్సిన పదవిని తొక్కిపెట్టేలా చక్కం తిప్పారు.
ఇక, ఇప్పుడు బీజేపీ జాతీయ సారధి అమిత్ షా రాజమండ్రికి వస్తున్నారు. రైతు సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా అయినా .. రాష్ట్ర అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. కానీ, ఇప్పటి వరకు ఉన్న ప్లస్, మైనస్లను పరిగణనలోకి తీసుకుంటే.. సోము వీర్రాజుకు ఛాన్స్ లేదని స్పష్టమైంది. ఇప్పుడున్న హరిబాబును కొనసాగిస్తే.. ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదని, ఒకవేళ ఆయనను మారిస్తే మాత్రం.. మాణిక్యాలరావుకు పగ్గాలు అప్పగించాలనే కామెంట్లు వినవస్తున్నాయి. సో.. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదే కనుక వర్కవుట్ అయితే.. సోము వీర్రాజుకు భారీ షాక్ తప్పదు!!