ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వార్కు కారణమైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయారని టీఆర్ఎస్ ప్రభుత్వం నానా రచ్చ రచ్చ చేసేసింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్రబాబును నువ్వు దొంగ అని ఓపెన్గానే అనేశారు. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలోనే పెద్ద మచ్చగా మిగిలింది. అప్పట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ మందగించింది.
అయితే ఈ కేసు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్లో అయితే ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైకాపా మాత్రం దీనిని తిరగదోడుతోంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై పూర్తిగా విచారించాలని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించిన వెంటనే చంద్రబాబు దీనిపై హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. ఈ కేసుతో సంబంధం లేని రామకృష్ణారెడ్డికి దీనిపై విచారణ కోరే అర్హత లేదని బాబు తన పిటిషన్లో పేర్కొన్నారు.
తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ఏసీబీని వివరణ కొరింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా తెలంగాణ ఏసీబీ వ్యవహరించిన తీరు ఇప్పుడు రకరకాల సందేహాలకు తావిచ్చేదిగా ఉంది. సోమవారం ఈ కేసుపై జరిగిన విచారణలో తెలంగాణ ఏసీబీ తరఫున సీనియర్ లాయర్ రవికిరణ్ కుమార్ వాదిస్తూ ఈ కేసుతో ప్రమేయం లేని మూడో వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ కేసులో మరోసారి విచారణ కోరమనే అర్హత లేదని అన్నారు.
ఇక ఈ కేసు విచారణ స్లోగా జరగడంపైనా రవికుమార్ స్పందించారు. చంద్రబాబు వాయిస్ రికార్డును నిశితంగా గమనిస్తున్నామని… ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపైనా దృష్టి పెట్టామన్న ఆయన దర్యాప్తు వేగంగా లేదని ఆరోపించడం సరికాదన్నారు. ఇక్కడ షాక్ ఏంటంటే తెలంగాణ ఏసీబీ ఆళ్ల పిటిషన్ను ఎక్కడా సమర్థించలేదు సరికదా వ్యతిరేకించింది. దీంతో వైకాపాకు పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది. ఇక ఈ విషయంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందే తెలంగాణ ఏసీబీ. మరి ఇప్పుడు ఇదే కేసుపై మరో వ్యక్తి వేసిన పిటిషన్కు వ్యతిరేకంగా తెలంగాణ ఏసీబీ వ్యవహరిస్తుండడంతో రాజకీయవర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.