అవును! టీడీపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న టాలీవుడ్ మాజీ హీరోయిన్ కవిత ఇప్పుడు సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తోంది. వాస్తవానికి తాను సీనియర్ ఎన్టీఆర్ హయాంలోనే పార్టీలోకి వచ్చానని, అప్పటి చైతన్య రథం వెంట పరుగులు కూడా పెట్టానని చెప్పుకొనే కవిత.. ఇప్పుడు మాత్రం తనను పట్టించుకునేవారు కరువయ్యారని వాపోతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంగతిని పక్కన పెడితే.. విపక్షంలో ముఖ్యంగా వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ప్రతి రోజూ మీడియా మీటింగులతో ఇరగదీసిన మాట వాస్తవం.
అయితే, పాలిటిక్స్ అన్నాక అవసరం మేరకు వాడుకోవడం ఆ తర్వాత లూప్లైన్లోకి తోసేయడం తెలిసిందే కాబట్టి. కవిత తన విషయంలోనూ ఇదే జరిగిందని వాపోతోంది. ఏపీ రాజధాని విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగింది. బాబు మారిపోయారని పేర్కొంది. అయితే, ఈ మార్పు తన విషయంలో మరింత కఠినంగా ఉండడమే చాల బాధిస్తోందని తెలిపింది.
తాను సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో ఉన్నానని, ఈ క్రమంలోనే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు తాను నిత్యం అధికార పార్టీని ఏకేశానని, టీడీపీకి మైలేజీ పెంచానని చెప్పుకొచ్చారు. అలాంటి తనను అధికారంలోకి రాగానే బాబు పక్కన పెట్టేశారని వాపోయింది. అదే సమయంలో తనను పలు పార్టీలు ఆహ్వానిస్తున్నాయంటూ కవిత బాంబు పేల్చడం గమనార్హం. అయినా.. తాను టీడీపీ కోసం అన్నీ త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్ననని ఆమె చెప్పారు. మరి దీనిపై సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .