భవిష్యత్తు ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయని చెప్పేందుకు చాలా కారణాలే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అగ్రనటుడు పవన్ కల్యాణ్ రాజకీయ బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉండటం ఒకటైతే.. ఇక విపక్ష వైసీపీ అధినేత జగన్ టీడీపీకి ప్రత్యామ్నాయం తన పార్టీయేనని చాటేందుకు.. పాదయాత్రకు సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలు మరో ముఖ్యాంశం.
నిజానికిప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఒకపక్క ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉండటంతో… తన సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం ద్వారా…ఎన్నికల నాటికి ప్రజల్లో మరింత ఆదరణ పెంచుకోవాలని అధికార టీడీపీ ప్రయత్నిస్తుండగా… మరోపక్క దానికి ధీటైన ప్రత్యర్థులం తామేనని చాటుకునేందుకు వైసీపీ, పవన్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓరకంగా జగన్-పవన్ పార్టీలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా నిలిచేందుకు… ముందస్తు సన్నాహంగా ఇప్పుడు విపక్ష హోదా కోసం పోటీ పడుతున్నాయన్నమాట.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వారు తామే ఒడిసిపట్టాలని ప్రజలకు అధికారంలోకి రాగల పార్టీగా ఎవరు నమ్మకం కలిగించగలుగు తారో.. తటస్థుల ఓటింగ్ కూడా అటువైపే మరలే అవకాశం ఉంటుందన్నఅంశాన్ని ఈ రెండు పార్టీల అధినేతలు బాగానే ఒంటబట్టించుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే జగన్ పార్టీ పవన్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టడం కూడా మొదలుపెట్టింది. కేవలం చంద్రబాబుకు మేలుచేసేందుకే పవన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం పెద్దఎత్తున మొదలుపెట్టింది.
ఇక జగన్ ఎత్తులకు దీటుగా పవన్కల్యాణ్ కూడా పై ఎత్తులు వేసే దిశగా పక్కాగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. జగన్ విమర్శలకు గట్టి జవాబు చెప్పే.. రాజకీయ స్కెచ్లో భాగంగా పవన్ కల్యాణ్ ఓ ఆశ్చర్యకరమైన అడుగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో సీబీఐ ఆఫీసర్ గా సత్యం కుంభకోణం, 2 జి స్పెక్ట్రమ్ స్కామ్, జగన్ అవినీతి ఆరోపణలు వంటి వాటిని అత్యంత సమర్థంగా వేగంగా డీల్ చేసి.. అటు అధికార వర్గాల్లోను, ఇటు ప్రజల్లోను రియల్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న జేడీ లక్ష్మి నారాయణతో పవన్ కల్యాణ్ రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.