అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డిజె’ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘డిజె దువ్వాడ జగన్నాథమ్’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం జరుగుతున్న అన్వేషణ ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల ఫేం పూజా హెగ్దే దగ్గర ఆగిందట. పూజా హెగ్దే పేరుకి అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఓటేసినట్లుగా తెలియవస్తోంది. గతంలో ఒకసారి ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సరసన నటిస్తోందనే వార్తలు వినిపించాయి. కానీ మళ్లీ ఆ టాక్ బయటికి రాలేదు. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో ‘మొహంజోదారో’ సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం పూజాకు ఆశించినంత విజయం అందివ్వలేకపోయింది. దాంతో అమ్మడికి అక్కడ అదృష్టం పట్టినట్లే పట్టి చేజారిపోయింది.
కానీ తెలుగులో మాత్రం అవకాశాలు పిలిచి వరిస్తున్నాయనిపిస్తోంది. అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఇంతవరకూ చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్లా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘రేసుగుర్రం’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన అల్లు అర్జున్, ‘దువ్వాడ జగన్నాథమ్’తో మరో హ్యాట్రిక్కి రెడీ అయ్యాడనేది నిస్సందేహం