ఏపీ విపక్షం వైకాపా అధినేత జగన్కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పార్టీ నుంచి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ చేసి సైకిల్ ఎక్కుతాడా? అని నిముషం ఒక యుగంగా టెన్షన్ పడిన ఆయన ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో భారీస్థాయలో టెన్షన్ పడి… దాని విషయంలో ఫుల్లుగా ఫెయిల్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆయనకు మరో టెన్షన్ పట్టుకుంది. కాపు ఉద్యమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వసంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి విషయంలో జగన్కు నిద్రపట్టడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
అప్పటి విధ్వంసానికి భూమన కూడా స్కెచ్ గీశాడని, ఆయన పాత్ర ఉందని, ముద్రగడ పద్మనాభంతో కలిసి.. ప్లాన్ చేశారని అనుమానిస్తున్న ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఇప్పటికే భూమనను రెండు సార్లు విచారించింది. ఈ క్రమంలో గుంటూరులోని సీఐడీ ఆఫీస్లో మంగళవారం మరోసారి భూమనను విచారించిన అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో చాలా సేపు బయటకు రాకపోవడంతో భూమనను అరెస్టు చేస్తారనే టాక్ బయటకు వచ్చింది. దీంతో వైకాపా నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో వైకాపా అధినేత జగన్ తీవ్ర టెన్షన్కు గురయ్యాయరు.
అందుబాటులో ఉన్న నేతలతో హుటాహుటిన భేటీ అయి.. ఏం చేయాలనే విషయంలో చర్చించారు. వాస్తవానికి కాపు ఉద్యమానికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్లో జగన్ ఉన్నాడని, ఆయన కనుసన్నల్లోనే తుని విధ్వంసం జరిగిందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా ముద్రగడ వెనుక కూడా జగన్ ఉన్నాడని టీడీపీ మంత్రులు కూడా విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను ముద్రగడ ఖండించారు. కానీ, జగన్ మాత్రం ఎప్పుడూ అసలు స్పందించలేదు. తుని విధ్వంసం ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. కానీ, ఇప్పుడు తాజాగా భూమన విషయం తెరమీదకి వచ్చేసరికి ఆయన ఎప్పుడు అరెస్టవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో జగన్ తీవ్ర టెన్షన్ పడుతుండడం గమనార్హం.